ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర
ఎవరి కజ్జల భాష్పధారవే మంజీర
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృతభాండాలు
నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు చైత్రరథమ్ము
ఎవరికొరకై పరుగులెత్తి వచ్చితివి
ఎవరిజూచి తటాకమై నిల్చిపోతివి
జీరలు పడ్డ నా గళము జేరి నవధ్వని జాలువార్చు మంజీరవు నీవు
నీవెలుగుచిందెడి చక్కని దేహవల్లి కే చీరలు కాస్క తేగలను చెప్పుము తెల్గునదీ
తెలుంగు బంగారపు రంగులద్దిన నిగారపు కావ్యదుకూలముల్ వినా..?
ఆకలి తీర్చుకున్న ఘనమైన మహయజనమ్ము కాన మీ లోకమునందు
మీ మనసులో నొకనాడు తదీప్సితమ్ము చీ కాకొనరింప వాకవయి,
కాలువవై, ఝురివై, తటాకమై మాకొర కేగుదలచితి సుమా..
కమనీయ పయోభరమ్మునన్
శిలగా నే గిరిసీమ డాగితివో మంజీరా
శతాబ్దాలు నిశ్చలవృత్తిన్ పలుకేని లేక నొక
వృక్షచ్ఛాయ దుష్టాత్మ గుండెలలో ద్వేషమువోలె ఇంచుకయినన్ హృద్యముగా
కిప్డు కన్నుల నీరై ఇటు జారినావు దయతోనో, ప్రేమభావాననో
నిను కరిగించి తెచ్చిన పునీతుడెవండతనిన్ భగీరథుండనవలె
వాడు నా తెలుగుటంగణమందలి ముండ్లదుబ్బులన్
తునియలు కొట్టి ఈ చెరుకుతోటలగూర్చి హలమ్ము గ్రుమ్మి,
భూమిని ప్రసరింపజేసి పసిమిన్ మిసిమిన్ పెకలించె దండిగా
ఆతదు నేలదున్ని బ్రతుకంతయు పస్తులు పన్న రైతు మా పోతన యేమొ
వాని వడపోతలలో కవితాప్రపంచ మా పాతమనోహరమ్మయిన పల్కు జగద్వీదితమ్ము
వాని సంగాతము నీకు కావ్యతను కల్పన చేసినదోయి, వాహినీ..
ఒకట నదివయి, ఒకచోట నొదిగి యొదిగి
సాగరమవై చలింపక సమసియుంటి
వెంత సౌమ్యస్వభావమోయీ,
పరుంగలిడు మనస్సును బంధింప దొడగినావు.
ఇందూరుమండలం బెందాక నీనీటి తడి తాకి తీయని తనము నొందు,
నా తెలంగాణమ్ము గీతనృత్తములతో నెందాక నిన్ను పూజించుచుండు,,
నెందాక నిరుపేదలంది నీ జలధార పండింత్రు కొల్లగా పైరుపంట,
లే కవీశులు నీ మహాకావ్యత నెరింగి తమ కలమ్ములకు సౌందర్య మిడుదు.
రంతదాక మహీమండలాంతరమున
నీ వెలుంగుకు రవ్వంత నీడ రాదు,
దివ్య గోదావరీ గృహాంతికమునండు
నీ విలాస మేనాటికి నిలిచిపోదు.
రుద్రవీణ తీవమాద్రి జుంజుమ్మని
తరగలెత్తి వచ్చుదాన నీవు,
నా మనస్సులోన నాదాలు కల్పించి
స్పందనమ్ము నేర్పజాలినావు.
నా తెలుగువీణ పోయిన మూర్ఛనలు నేడు
నీవుగా పారి నిండినవి నా భూమిలో,
ఇక ఎన్ని చెరుకు తోటలు పండనీచోట ?
ఎన్ని చ్క్కెరమిల్ల్లు లివురింపవు ?
ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలు చేసి
రవ్వల్ల వీణపై రాగమొత్తిరి నిన్ను ?
ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను ?
యేమన్నదే నిన్ను ఏడుపాయల దుర్గ ?
ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది
పాడుకొమ్మనాది పరుగులిడమన్నాది
స్వరమొక్కపాయగా సాగిపొమ్మన్నాది
బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది
అదిగో హసంతికలు, అదె సుమ లలంతికలు
అదిగో సేమంతికలు, అదిగో వాసంతికలు
జయదాయకములు, సంశయ మాయకమ్ములు
ప్రియకరము లమృతపిచ్ఛిలము లుజ్జ్వలములు
మిట్టలెక్కి యెక్కి గుట్టలు దిగజారి
త్రోవ గడచి వచ్చినావి నీవు,
మిగుల శ్రమలుగొన్న మిసిమింతు రాలవు
సేదతీరుమీ ప్రసిద్ధభూమి
మహోంధ్రోదయంలో ధాశరథి గారు మంజీర నది గురించి రాసిన కవిత, మొన్న పాత పుస్తకాలు తిరగేస్తుంటే దొరికింది, నా బ్లాగు దీనితోనే మొదలు పెడదామని డిసైడు అయ్యి మీతో పంచుకుంటున్నాను